Kakarla Suresh : అప్పసముద్రం దుర్ఘటన బాధిత చిన్నారులకు సీఎం ఆర్థిక సాయం
ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలో ఇటీవల వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో బాణాసంచా పేలుడు కారణంగా తొమ్మిది మంది చిన్నారులు తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, బాధిత చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. దీని ఫలితంగా, బాధిత చిన్నారులందరికీ ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు వైద్య అవసరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ తనవంతు సహాయం అందిస్తానని, అలాగే గాయపడిన చిన్నారుల భవిష్యత్తు వైద్య అవసరాలు, ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే, ప్రభుత్వం తరఫున తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని, అలాగే సంబంధిత అధికారులకు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసే విధంగా కఠిన చర్యలను తీసుకోవాలని, ఆదేశించారు. గ్రామాలలో జరిగే ఉత్సవాలలో వేడుకలలో తల్లిదండ్రులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అది మనందరి బాధ్యతాన్ని అని అన్నారు. అలాగే గాయపడిన పిల్లల వైద్య చికిత్స కోసం ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధిత కుటుంబాల వెన్నంటి ఉంటుందని తెలిపారు.