మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణిపై టీఎన్టీయూసీ నేత గుణశేఖరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా నాన్న నగరికొండ సమీపంలోని జ్యోతినగర్లో 1982లో స్థలం కొన్నామని... దాన్ని మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, నగరి పురపాలక సంఘం ఛైర్మన్లతో కలిసి మీనాకుమార్ అనే వ్యక్తి కబ్జా చేశారని.. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గుణశేఖరరెడ్డి ఫిర్యాదు చేశారు. తన స్థలంలో రేకుల షెడ్ వేశారని... పోలీసులు సైతం వారి ప్రలోభాలతో తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆర్డీవో, తహసీల్దార్కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాకకు చెందిన గుణశేఖరరెడ్డి వాపోయారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.