Srikakulam: 'అసనీ' తుపాను ఎఫెక్ట్.. సముద్రంలో కొట్టుకు వచ్చిన బంగారు రంగు రథం
Srikakulam: అసనీ తుపాను ప్రభావంతో ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా సున్నపల్లి సీ హార్బర్ వద్ద ఓ బంగారు రంగు రథం కొట్టుకు వచ్చింది.;
Srikakulam: అసనీ తుపాను ప్రభావంతో ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా సున్నపల్లి సీ హార్బర్ వద్ద ఓ బంగారు రంగు రథం కొట్టుకు వచ్చింది. ఒడ్డున ఉన్న ప్రజలు రథాన్ని నీటిలో నుండి లాగి ఒడ్డుకు చేర్చారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెంది ఉండవచ్చని కొంతమంది మత్స్యకారులు భావిస్తున్నారు.
ఇలాంటి విచిత్రమైన రథం ఇంతకు ముందు వచ్చిన పెద్ద తుపానులప్పుడు కూడా కొట్టుకు రాలేదని స్థానికులు తెలిపారు. కొట్టుకు వచ్చిన రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందిరం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనపై నిఘా విభాగానికి సమాచారం అందించామని నౌపడ (శ్రీకాకుళం జిల్లా) సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
"ఇది వేరే దేశం నుండి వచ్చి ఉండవచ్చు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించాము" అని ఎస్ఐ చెప్పారు. బుధవారం తెల్లవారుజామున, భారత వాతావరణ శాఖ (IMD) 'అసని' బలహీనపడి 'తుపాను'గా మారిందని ఇది గురువారం ఉదయం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తుపాను కారణంగా బుధవారం ఉదయం ఇండిగో విమానాలన్నీ రద్దయ్యాయి. అసనీ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.