దేశవ్యాప్తంగా విజయ దశమి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు దసరా పండుగశోభ సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ప్రతి ఒక్కరు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండగ చేసుకుంటారు. దసరా పండగకు చాలా ప్రత్యేకలున్నాయి. మహిషాసురుడిని శ్రీదుర్గాదేవి సంహరించడం.. తేత్రాయుగంలో రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు గెలవడం.. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు అజ్జాత వాసం ముగియడంతో.. జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను ఆర్జునుడు కిందకి దింపడం.. తదితర సంఘటనలన్నీ ఈ దసరా పర్వదినం రోజే చోటు చేసుకున్నాయని పెద్దలు పేర్కొంటారు. దసరా పండగ రోజు.. ప్రజలు తమ మనస్సులోని చెడును విడిచిపెట్టి మంచి మార్గాన్ని అనుసరించాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
దసరా పండుగ వేళ దైవిక స్త్రీశక్తి స్వరూపంగా దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారు. కనకదుర్గమ్మ అమ్మవారిని పూజించడం వల్ల రక్షణ, బలం, జ్ఞానం లభిస్తాయని బలంగా నమ్ముతారు. దసరా నవరాత్రులు వచ్చాయంటే దుర్గాదేవి నామస్మరణలో మునిగిపోతారు. కొంత మంది భక్తులు దుర్గాదేవి మాల సైతం ధరిస్తారు. జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల నుంచి విముక్తి పొందేలా చేయమని అమ్మవారిని వేడుకుంటూ.. దుర్గాదేవి మంత్రాలు పఠిస్తారు.
. ‘విజయ ముహూర్తం’ ఎప్పుడు? ఏం చేయాలంటే..
విజయ దశమి రోజంతా మంచిదే అయినప్పటికీ.. ఇందులో విజయ ముహూర్తం ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. 2025 అక్టోబర్ 2న విజయ ముహూర్తం మధ్యాహ్నం 2.10గంటల నుంచి 2.58గంటల వరకు ఉంది. ఈ 48 నిమిషాల కాలం ఎంతో బలమైనది. ఎంతో శక్తిమంతమైన ఈ ముహూర్తంలో ఏ కొత్త ఆలోచన చేసినా, ఏ కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
ప్రముఖుల శుభాకాంక్షలు
సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా ఈ పండుగ నిలుస్తుందని రేవంత్ తెలిపారు.