EC: దొంగ ఓట్లపై ఈసీ సీరియస్.. అనంతపురం జడ్పీ సీఈవో పై వేటు
ఉరవకొండ నియోజకవర్గంలో భారీగా నకిలీ ఓట్ల నమోదు;
దొంగ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది.అనంతపురం జడ్పీ సీఈవో భాస్కర్రెడ్డిపై వేటు పడింది. ఆయన్నిఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఓట్లు తొలగించడం.. దొంగ ఓట్లు నమోదు చేస్తుండడం.. ప్రతిపక్షాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం.. జీరో డోర్ నంబర్పై ఓట్ల నమోదు వంటి అక్రమాలు రోజూ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈసీ ఏకంగా జడ్పీ సీఈవోనే పదవి నుంచి తొలగించడం అధికారుల్లో ఆందోళన రేపుతోంది.
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గం ఉరవకొండలో దొంగ ఓట్లను చేర్చడంతోపాటు ఉన్న ఓట్లను తొలగించిన పర్యవసానంగానే ఆ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా ఉన్న భాస్కర్రెడ్డిని సస్పెండ్ చేశారు. తన నియోజకవర్గంలో 6 వేల బోగస్ ఓట్లను చేర్పించడంతోపాటు ఉన్న వాటినీ తొలగించడంపై కేశవ్.. గతంలోనే ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఉరవకొండకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ అవకతవకల్లో ఈఆర్వో భాస్కర్రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేయాల్సిందిగా సీఎస్కు ఈసీ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. అయినా.. చాలారోజులు పెండింగ్లో ఉంచారు. ఈసీ మరోసారి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు పంపడంతో భాస్కర్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఓట్ల తొలగింపునకు సంబంధించి ఫారం-7 గానీ, నోటీసులుగానీ ఇవ్వకుండా భారీస్థాయిలో టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేశారు. దీనిపై ఆధారాలతో ఈసీకి కేశవ్ ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఓట్ల తొలగింపుపై తొలుత స్థానిక అధికారులే విచారణ జరిపారు. అవకతవకలకు జరగలేదని, నిబంధనల మేరకే వ్యవహరించారని వారు నివేదిక పంపారు. అందులో స్పష్టత లేకపోవడంతో ఢిల్లీ నుంచి ఈసీ అధికారులే ఉరవకొండలో పర్యటించారు.
విచారణ చేపట్టి, స్థానిక అధికారులిచ్చిన నివేదికలు తప్పుడువని తేల్చారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో విధివిధానాలు అవలంబించలేదని గుర్తించారు.జాబితాలో దాదాపు 9 వేల189 ఓట్లు స్థానికేతరులు, చనిపోయిన, వలసలు వెళ్లిన వారివి ఉన్నట్లు గుర్తించారు. అందులో అధికంగా నకిలీ, డబుల్, ట్రిపుల్ ఓట్లు నమోదు చేశారనే ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.