విశాఖలో ఇంటర్మీడియెట్ చదువుతున్న వరలక్ష్మిపై అఖిల్ సాయి అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి శ్రీనగర్ కొండపై సాయిబాబా గుడి వద్ద రామ్ అనే యువకుడితో వరలక్ష్మి మాట్లాడుతుంటే బీఎల్ చివరి సంవత్సరం చదువుతున్న అఖిల్ సాయి అక్కడికి వెళ్లాడు. రాముతో చనువుగా ఉంటోందని వరలక్ష్మీపై కోపం పెంచుకున్న అఖిల్ సాయి.. బ్లేడ్తో దాడి చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ కేసుపై వారం రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.
మరోవైపు.. ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్నుంచి ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మహిళలపై నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. ముప్పు ఉందని సమాచారం ఇస్తే.. ఉదాసీనంగా వ్యవహరించకుండా వెంటనే స్పందించాలన్నారు. వరలక్ష్మి కుటుంబసభ్యులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు.