చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో పశువుల పండుగ (జల్లికట్టు) నిర్వహించారు. పరిసరాల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పశువులను తీసుకొచ్చారు. వీటికి కొమ్ములు చెలిగి, రంగులు వేసి కొప్పులను తొడిగారు. నాయకులు, సినీనటులు, దేవుళ్ల ఫొటోలతో అలంకరించారు. రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలతో పాటు, నగదు, దుస్తుల, విలువైన వస్తు సామగ్రిని కట్టారు. గ్రామ నడివీధిలో పశువులను గుంపులుగా వదిలారు. వేలాది మంది యువకులు అల్లె అవతల నిలబడ్డారు. కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీపడ్డారు. చెక్కపలకలను చేజిక్కించుకోవడంలో యువకుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు కింద పడటంతో పదిమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్లికట్టును తిలకించడానికి వచ్చిన వారందరికీ గ్రామస్తులు భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు.