విశాఖ జిల్లా విస్సనపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జనసేన కార్యకర్తలు వేసిన టెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు జనసైనికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జరాయితీ భూమిలో టెంట్ ఎలా వేస్తారని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏ భూమో రికార్డులు మీ దగ్గర ఉన్నాయా చెప్పాలంటూ జనసైనికులు నిలదీశారు.
విసన్నపేట గ్రామంలో ఆక్రమణకు గురైన భూములను కాసేపట్లో పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విసన్నపేటలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్ 195/2 లో 609 ఎకరాలలో అధికార పార్టీ నేతలు లే అవుట్ వేశారు. గెడ్డలు, వాగులు, కొండలను ఇష్టానుసారంగా తవ్వేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని గతంలోనే జనసేన, టీడీపీ ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల లోకాయుక్తలో విసన్నపేట భూములపై జనసేన నాయకులు దూలం గోపి ఫిర్యాదు చేశారు. అక్రమ లే అవుట్ వెనుక మంత్రి అమర్నాథ్ హస్తం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి అమర్నాథ్ ప్రమేయం వల్లే అధికారులు నివేదికను బయట పెట్టడం లేదని తెలుస్తోంది.