VIJAYAWADA: విజయవాడలో కిడ్నీ దొంగలు

రూ.30 లక్షలు ఇస్తామంటూ కిడ్నీ బేరం... ఆపరేషన్‌ అయ్యాక డబ్బులు ఇవ్వని మధ్యవర్తులు;

Update: 2024-07-09 01:00 GMT

విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు కావడం సంచలనం రేపుతోంది. కిడ్నీ ముఠా మోసాలు వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్య కాలనీకి చెందిన బాధితుడు మధుబాబు ఆరోపించారు. తాను కిడ్నీ ఇచ్చినా డబ్బు అందలేదని.. బోరుమన్నాడు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన మధుబాబు... ముఠా చేసిన మోసాన్ని వివరించారు. తనకు వివాహమైందని.. ఇద్దరు పిల్లలు ఉన్నారని... వ్యాపారం చేసి ఆర్థికంగా చాలా నష్టపోయానని తెలిపాడు.

కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అప్పులు చేశానన్నాడు. ఆ క్లిష్ట సమయంలో ఫేస్‌బుక్‌లో బాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడని... కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పాడన్నాడు. అప్పులు తీర్చడంతో పాటు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించానని.... బాషా ద్వారా మధ్యవర్తి వెంకట్‌తో మాట్లాడానన్నాడు. తన వద్ద రోగి ఉన్నాడని.. అతనికి కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మించాడన్నాడు. చివరికి రోగి బావ సుబ్రహ్మణ్యాన్ని తనకు పరిచయం చేశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారని.. రోగికి సరిపోయేలా ఉండటంతో తొలుత రూ.59 వేలు ఇచ్చారని మధుబాబు వెల్లడించారు.

కిడ్నీ ఇవ్వాలంటే సమీప బంధువుగా ఉండాలని తన ఆధార్‌కార్డును వారికి అనుకూలంగా మార్పించారని మధుబాబు తెలిపాడు. తనకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం నకిలీ పత్రాలు సృష్టించారని వెల్లడించాడు. ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి గత నెల 15న శస్త్రచికిత్స చేశారని.... స్పృహ వచ్చిన తర్వాత చూస్తే కుడివైపు ఉన్న కిడ్నీని వెంకటస్వామి అనే వ్యక్తికి మార్పిడి చేశారని తెలిపాడు. ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు కాకుండా.. రూ.50 వేలు మాత్రమే ఇచ్చారని... ఇదేంటని రోగి బంధువు సుబ్రహ్మణ్యం, మధ్యవర్తి వెంకట్, వైద్యుడు శరత్‌బాబును అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తెలిపారు. కిడ్నీ తీసినవాళ్లం.. ప్రాణాలు తీయడం లెక్క కాదని బెదిరించారని మధుబాబు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే కిడ్నీ మార్పిడి చేశామని శరత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ అధినేత డాక్టర్‌ శరత్‌బాబు తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశామన్నారు. వెంకటస్వామి కుటుంబ మిత్రుడైన మధుబాబు మూత్రపిండం దానం చేశారని... కిడ్నీ విక్రయాలపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.

Tags:    

Similar News