AMARAVATHI: అమరావతిలో భూ కేటాయింపులు
రాజధానిలో ఊపందుకున్న భూ కేటాయింపులు.. 10 సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం;
అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపుల వ్యవహారం ఊపందుకుంది. గతంలో కేటాయించిన భూముల్లో కొన్ని రద్దు కాగా, మరికొన్నింటికి మార్పులు చేశారు. తాజాగా మరో పది సంస్థలకు భూములు కేటాయించడంతో అమరావతిలో మళ్లీ సందడి మొదలైంది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 16 అంశాలకు గాను 12 అంశాలు మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం పొందాయన్నారు. 2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలను కొనసాగిస్తూ ఆమోదం తెలిపామన్నారు. సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ ఆమోదం తెలిపామన్నారు. జుయలాజికల్ ఆఫ్ సర్వే సంస్థకు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అలాగే స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు ఐదు ఎకరాల కేటాయింపు కొనసాగిస్తూ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు మూడు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపామని.. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
ఈ సంస్థలకే కేటాయింపులు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు (CBI) 2 ఎకరాలు, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు 3 ఎకరాలు కేటాయింపులను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2014- 19లో గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బత్తి సంస్థకు చేసిన భూకేటాయింపులు రద్దు చేశారు. ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB) కి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి 0.5 ఎకరాలు, బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.