LOKESH: నిరూపిస్తే రాజీనామా చేస్తా
జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేశ్.. ఉర్సా కంపెనీకి చట్ట ప్రకారమే భూములు కేటాయించామని వెల్లడి;
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. విశాఖలో రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే..యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ జగన్ చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బురద జల్లి ప్యాలస్లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ చేశారు. ఈ మేరకు నారా లోకేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్' లో.. ' ఫేక్.. ఫ్యాక్ట్' అంటూ జగన్ ఫొటోతో కూడిన ఒక పోస్ట్ చేశారు.
'వైఎస్ జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్కు సిద్ధమా జగన్ రెడ్డి గారు?' అంటూ సవాల్ చేశారు.
లోకేశ్ ఇంకా ఏమన్నారంటే...
నారా లోకేష్ తన పోస్ట్లో ఏమన్నారంటే.. 'మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది.' అంటూ సెటైరికల్ చురకలంటించారు నారా లోకేష్. మరి ఈ సవాల్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారో.. లేదో చూడాలి. అని అన్నారు.
జగన్ పాలనలో ఒక్క కంపెనీ రాలేదు
ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని, పైగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని తాము పనిచేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రాబడుతున్నామని, నూతన కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. "ఈనో వాడండి, కాస్త రిలీఫ్ వస్తుంది" అంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమని అన్నారు.
వైసీపీ ఓ సైకో పార్టీ
తన దృష్టిలో వైసీపీ ఎప్పటికీ ఓ సైకో పార్టీనే అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తాజాగా, మైలవరంలో ఓ పిల్లాడి చేతిలోంచి సైకిల్ లాక్కొని టీడీపీని టార్గెట్గా చేసుకుని వైసీపీ నేతలు చేసిన హంగామా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే అదే వీడియోపై తాజాగా మంత్రి లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అబ్బే వాళ్లేమి మారలేదు.. మారరు కూడా అంటూ కామెంట్ చేశారు. ఏ ముహూర్తాన సైకో పార్టీ అని పేరు పెట్టామో.. కానీ ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారని సెటైర్లు వేశారు. అందుకే నాటికి.. నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ అని.. వాళ్లకి సైకో నాయకుడు అని ఫైర్ అయ్యారు. ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను.. చిన్న పిల్లవాడి చేతిలో నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలనే తాను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అంటూ కామెంట్ చేశారు.