YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో కీలక నిందితుడు ఉమాశంకర్‌రెడ్డికి బెయిల్‌పై కడప కోర్టు తీర్పు..

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ కొట్టేసింది కడప కోర్టు.

Update: 2022-03-24 15:32 GMT

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ కొట్టేసింది కడపకోర్టు. ఆయనకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదనలు విపించింది సీబీఐ. వివేకాను హత్యకు నలుగురు సహనిందితులతో కలిసి కుట్ర పన్నారని తెలిపింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకోవాల్సిన సమయంలో ఉమాశంకర్‌రెడ్డికి బెయిలివ్వడం సరైంది కాదని వాదించింది.

వివేకా తలపై గొడ్డలితో తొలి దాడి చేసింది ఉమాశంకర్‌రెడ్డేనని దర్యాప్తులో తేలినట్లు స్పష్టం చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కడప కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. వివేకా హత్య కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ జరిగింది.

వాచ్‌మెన్‌ రంగన్న, అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం వివేకాను హత్య చేసిన నలుగురిలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉందని వాదనలు విపించారు సీబీఐ తరుపు న్యాయవాధి. వివేకాను ఆయన ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి కలిసి హత్య చేశారని, ఆ సమయంలో తిడుతూ గొడ్డలితో ఆయన తలపై తొలివేటు వేసింది ఉమాశంకర్‌రెడ్డేనని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు కోర్టుకు నివేదించింది.

వివేకాను స్నానపు గదిలో పడేసిన తరువాత మరో ఐదారుసార్లు తలపైన గొడ్డలితో ఉమాశంకర్‌రెడ్డే నరికాడని వివరించింది. హత్య జరిగిన రోజున తెల్లవారుజామున పారిపోతున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించినట్లు తెలిపింది. కేసు విచారణలో భాగంగా ఉమాశంకర్‌రెడ్డి బైక్‌, ఇంట్లోని రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపింది.

ఈ సమయంలో బెయిలిస్తే హత్యకు వినియోగించిన ఆయుధాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని వాదించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో దస్తగిరి, రంగన్న భద్రతపై సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది

Tags:    

Similar News