ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మొదటిసారిగా పర్యటించారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష. మొదటి సారి ఎమ్మెల్యే అయినా.. అసెంబ్లీలో ఏజెన్సీ గిరిజనుల కష్టాలు, బాధలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల శంకుస్థాపన కోసం మారుమూల అటవీ ప్రాంతంలోకి వెళ్లారు ఎమ్మెల్యే. సరైన రోడ్డు మార్గం లేకున్నా నడుచుకుంటూ కాలువలు, గుట్టలు దాటి శంకుస్థాపనలు చేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంపచోడవరం నియోజకవర్గ రోడ్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వానికి నివేదికలు తయారు చేసి అందించారు ఎమ్మెల్యే. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం నియోజకవర్గానికి తొలి విడతగా 30 కోట్ల రూపాయలతో ఏడు రోడ్లు మంజూరు చేసింది.