Nara Lokesh: ఉండవల్లి నివాసానికి నారా లోకేష్

నారా లోకేష్ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Update: 2021-09-09 10:22 GMT

నారా లోకేష్ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. గన్నవరం నుంచి ఆయన కాన్వాయ్‌ విజయవాడ వారధి వద్దకు చేరింది. అక్కడ ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు పోలీసులు. ఈ నోటీసులపై సంతకం చేశారు లోకేష్. దీంతో.. విజయవాడ వారది నుంచి ఉండవల్లిలోని నివాసానికి తీసుకెళ్తున్నారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులు, లోకేష్‌కు వాగ్వాదం జరిగింది. కచ్చితంగా అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు లోకేష్‌. ఇప్పటి వరకూ తాను పోలీసులకు సహకరించానని, ఆంక్షల పేరుతో పర్యటన అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఐనా.. అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు చెప్పడంతో విజయవాడ డీసీపీకి, లోకేష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వాల్సిందేనన్నారు. దీంతో పోలీసులు నోటీసులిచ్చారు.

బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు కూడా పర్మిషన్ కావాలా అంటూ పోలీసుల్ని ప్రశ్నించిన లోకేష్.. నరసరావుపేట వెళ్లాలనే తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు... లోకేష్ కాన్వాయ్ ఆపిన విషయం తెలిసి అక్కడకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ సహా పలువురు నేతలు అక్కడికి వెళ్లి పరామర్శకు పర్మిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉదయం నుంచే గన్నవరం టు నరసరావుపేట మొత్తం హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో.. పర్యటనకు అనుమతి ఇస్తారా, పోలీసులు ఏం చేస్తారు అనేది చర్చనీయాంశమైంది. తమ మాట కాదని పర్యటనకే వెళ్తానంటే అరెస్టు చేయాల్సి ఉంటుందని కూడా పోలీసులు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News