ఏపీలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రైతులకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుకోవడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. జగన్ 19 నెలల పాలనలో 767 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో లోకేశ్ "రైతు కోసం" యాత్ర చేపట్టారు.
మేడపి గ్రామంలో రైతులతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుఫాను ధాటికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఎకరానికి ఐదు వేల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.