Nara Lokesh: ఉదయగిరి నియోజకవర్గంలో యువగళం
తన గురించి తప్పుడు ప్రచారం చేసే వారిపై న్యాయ పోరాటం చేస్తున్నారు;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. రెండు రోజుల బ్రేక్ అనంతరం ఉదయగిరి నియోజకవర్గంలో మళ్లీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తన గురించి తప్పుడు ప్రచారం చేసే వారిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో పాదయత్రకు బ్రేక్ ఇచ్చారు. మంగళగిరి అదనపు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇవాళ మళ్లీ ఉదయగిరి వెళ్లి లోకేష్ పాదయాత్ర చేపట్టారు.
కొండాపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. మర్రిగుంట, రెనమాల, నేకునంపేట, కొత్తపేట మీదుగా సాగనుంది. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లోకేష్ అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు టీడీపీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. పాదయాత్రలో భాగంగా రాళ్లపాడు ప్రాజెక్టును లోకేష్ పరిశీలిస్తారు. తాతా హోటల్ సెంటర్లో స్థానికులు, ఎడమకాలువ రైతులతో సమావేశం అవుతారు. జంపా లవారిపాలెంలో రైతులతోనూ మాట్లాడుతారు. వాకమళ్లవారిపాలెంలో స్థానికులతో ముచ్చటిస్తారు. లింగసముద్రం, తిరుమలశెట్టి కోటయ్య సమాధి సెంటర్లో స్థానికుల సమస్యల్ని తెలుసుకుంటారు. లింగసముద్రం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశమవుతారు. బలిజపాలెం, రామకృష్ణాపురం ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నారు. అనంతరం వెంగళాపురం ప్రజల్ని కలుస్తారు. వెంగళాపురం శివారులోని విడిది కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనుంది.