Pawan Kalyan: నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్
జనసేనానికి అడుగడుగునా అమరావతి రైతుల నీరాజనం;
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంతో పాటు.. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ను మంగళవారం రోజే పరిశీలించారు పవన్.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్న జనసేనానికి అపూర్వ స్వాగతం పలికారు అమరావతి రైతులు.. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు.. ఇక, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గంటన్నరపాటు సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు..సచివాలయంలోని రెండో బ్లాకులో ఈరోజు ఉదయం 9.30 గంటలకు వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.30కి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కానున్నారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు జనసేనాని వెళ్లనున్నారు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు పవన్ రాగా, అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా ముళ్లకంచెలు దాటుకొని వచ్చి మరీ రైతులకు అండగా నిలబడ్డారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతలు పవన్ మెడలో ఆకుపచ్చ కండువాలు, భారీ గజమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లాయ పాలెం కూడలి వద్ద న్యాయదేవత విగ్రహానికి పవన్ పుష్పాంజలి ఘటించారు. కాన్వాయ్కు ఎదురుగా మహిళలు మోకాళ్లపై నిల్చొని నమస్కరించగా, వారితో కరచాలనం చేసి ముందుకు సాగారు. సుమారు 6 కి.మీ ప్రయాణానికి గంట సమయం పట్టింది. దారి పొడవునా ఎన్డీయే పార్టీల జెండాలు, బ్యానర్లతో నింపేశారు.