Srisailam Reservoir: పెరుగుతున్న వరద ఉదృతి...నిండు కుండలా శ్రీశైలం జలాశయం..
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండల మారింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.70 అడుగుల వద్ద నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు నాలుగు స్పిల్ వే గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు 1,08,076 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35 వేల క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత నెలరోజుల వ్యవధిలో నీటిని విడుదల చేయడం ఇది మూడవసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,02,456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నాగార్జున సాగర్ లో కూడా వరద ఉదృతి పెరుగుతుండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.