YS Viveka Murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో బయటికొస్తున్న సంచలన విషయాలు.. !
YS Viveka Murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సంచలనాలు బయటికొస్తున్నాయి.;
YS Viveka Murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సంచలనాలు బయటికొస్తున్నాయి. ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డిల పాత్రపై బలమైన సాక్ష్యాలు వెలుగుచూస్తున్నాయి. నిందితులపై మరింత ఉచ్చు బిగుస్తోంది. వివేకా కూతురు డాక్టర్ సునీత సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో పలు సంచలన విషయాలు బయటపెట్టారు. వివేకాను ఎవరు చంపారో పులివెందులలో చాలా మందికి తెలుసని, హంతకులెవరో తేల్చాలని అన్న జగన్ను కోరితే అన్యాయంగా మాట్లాడారని సునీత పేర్కొంది.
జగన్ కు అనుమానితుల పేర్లూ చెబితే, వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారని సునీత పేర్కొంది. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్ చేయడంతో, సీబీఐకి ఇస్తే ఏమవుతుంది..? అవినాశ్రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై12 కేసులు అవుతాయ్ అని జగన్ మాట్లాడడం తనను బాధించిందని సీబీఐ వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు.
తాజాగా వివేకా హత్యకు గురైన రోజు ఉదయాన్నే తొలుత కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆయన ఇంటికి వచ్చారని పులివెందుల మాజీ ఎంపీటీసీ కె.శశికళ సీబీఐ అధికారులతో చెప్పారు. వివేకా ఇంట్లోకి వెళ్లిన అవినాష్రెడ్డి 3, 4 నిమిషాల తర్వాత బయటకు వచ్చి లాన్లో నిలుచొని ఫోన్లో మాట్లాడుతూ కనిపించారని తెలిపారు. ఇంతలోనే డాక్టర్ మధు, కొందరు నర్సులు వచ్చారన్నారు.
కాసేపటికి వివేకా మృతి చెందారంటూ వారు వెల్లడించారని శశికళ చెప్పారు. తర్వాత వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ ప్రకాశ్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ అభిషేక్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వచ్చారని చెపప్ఆరు. ఆ సమయంలో తానూ వివేకా ఇంటి లోపలికి వెళ్లానని.. బెడ్రూమ్లో రక్తం, బాత్రూమ్లో మృతదేహాన్ని చూసి ఇది హత్యేనని తనకు స్పష్టంగా అనిపించిందని వివరించారు. వివేకా ఇంటికి ఆమె ఎందుకు వెళ్లారు, అక్కడేం జరిగిందనే అంశాలపై సీబీఐ...శశికళను విచారించి, 2020 సెప్టెంబరు 20న వాంగ్మూలం తీసుకుంది.
వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కల్లూరు గంగాధర్ రెడ్డి మాటమర్చారు. సీబీఐకు తానెలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. సునీతను ఈ కేసు నుంచి బయటపడేయాలని జగదీశ్వర్రెడ్డి అనే వ్యక్తి నన్ను ప్రలోభపెట్టారు. అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డిపై తప్పుడు సాక్ష్యం చెబితే కేసు బలంగా ఉంటుందన్నారు.. సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్ వద్దకు వెళ్లగా.. ఆయన కూడా తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. హత్య చేసినట్లు ఒప్పుకొంటే 10 కోట్లు ఇస్తామని అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆఫర్ చేసినట్లు చెప్పాలని ఏఎస్పీ ఒత్తిడి తెచ్చారు. మేం చెప్పినట్లు చేస్తే జగదీశ్వర్రెడ్డి నీకు డబ్బులు ఇప్పిస్తారని ప్రలోభపెట్టారనిని తెలిపారు.