Chandrbabu Naidu: రేపు ఉమ్మడి అనంత జిల్లాలో చంద్రబాబు పర్యటన

నీటి మూటలైన జగన్‌ హామీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వైసీపీ పాలనపై ప్రజలను చైతన్య పర్చనున్న చంద్రబాబు;

Update: 2023-08-02 07:21 GMT

రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. నీటి వనరులు అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన తీరును ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రైతాంగ సమస్యలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటైన అతిపెద్ద భారీ పరిశ్రమ కియాను కూడా ఆయన సందర్శించనున్నారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనంత రహదారులు, కూడళ్లు పసుపుమయంగా మారాయి.

రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు డ్యామ్, రాయదుర్గం బైరవాని తిప్ప ప్రాజెక్ట్, ఉరవకొండ నియోజకవర్గంలోని సామూహిక బిందు సేద్యం, హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల నిలిపివేత వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నారు. జగన్‌ నెరవేర్చని హామీలపై ధ్వజమెత్తనున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని ఎంపీలు మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక కార్ల పరిశ్రమలతో పాటు వాటి విడిభాగాల పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆయా పరిశ్రమల యాజమాన్యం వెనుకంజ వేయడంపై బాబు నిలదీయనున్నారు.

నాలుగేళ్లలో జగన్ అవలంబించిన కొన్ని చర్యలు వల్ల నష్టపోయిన రైతులు, యువత, ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చంద్రబాబు పర్యటన ఉపయోగపడుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. తమ అధినేత జిల్లా పర్యటనలో భాగంగా ఉమ్మడి అనంతపురం రావడం పార్టీ వర్గాలలో నూతన ఉత్తేజాన్ని నింపుతోందంటున్నారు. ఏదేమైనా అనంతపురం వైసీపీ నాయకులలో చంద్రబాబు పర్యటన పై జోరుగా చర్చ సాగుతోంది.

Tags:    

Similar News