కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో చేపట్టిన టిడిపి బస్సు యాత్ర విజయవంతమైంది. పిఠాపురం టీడీపీ కార్యాలయం నుండి ప్రారంభమైంది చైతన్య యాత్ర. పట్టణంలో గత టీడీపీ హయాంలో ప్రారంభమై నిర్మాణ దశలో నేటికి నిలిచిపోయి ఉన్న మినీ స్టేడియంతోపాటు.. బైపాసు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల, మోహన్నగర్లో లబ్ధిదారులకు ఇవ్వని టిడ్కో గృహాలు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనులను టీడీపీ నేతలు పరిశీలించారు.
ఇక టీడీపీ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,నాయకులు తరలిరావడంతో పిఠాపురంలో సందడి వాతావరణం నెలకొంది. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అడుగడుగునా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు జననీరాజనం పలికారు. సమస్యలు తెలుసుకుంటూ, చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగే మేలుపై నేతలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. తరువాత పిఠాపురం పట్టణంలోని ఉప్పాడబస్టాండు వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత,టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్టొని వైసీపీ నాలుగేళ్ల పాలనలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను వివరించారు.