URANIUM: యురేనియం తవ్వకాలపై టీడీపీ నిజ నిర్థారణ కమిటీ కీలక వ్యాఖ్యలు
నిరసనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి.. వైసీపీనే అనుమతి ఇచ్చిందని స్పష్టీకరణ;
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. యురేనియం తవ్వకాలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని దాదాపు 15 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. యురేనియం తవ్వకాలను నిలిపివేసేలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఆదేశాలు జారీ చేయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో యురేనియం తవ్వకాల విషయంలో తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీ వేసింది. కమిటీ సభ్యులు కప్పట్రాళ్లలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. స్థానిక నేతలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే నిరసనల్లో ప్రజా సంఘాలు చేరాయని తెలిపారు. యురేనియం ప్రాజెక్ట్ కేంద్రానికి సంబంధించినదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం
యురేనియం తవ్వకాలపై కొనసాగుతున్న ఆందోళనలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన కూటమి నేతల త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వను విస్తరించనున్నామని, జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాల్వ పనులను పూర్తి చేయటంపై దృష్టి సారిస్తామన్నారు. కర్నూలు నుంచి రాజధానికి రైళ్లు లేకపోవటం బాధాకరమన్నారు. జిల్లాలో వలసలు అధికంగా ఉన్నాయని, విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉల్లి, టమాట రైతులను ఆదుకుంటామన్నారు.
వైసీపీనే అనుమతి ఇచ్చింది
యురేనియం తవ్వకాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై బురద వేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రజల కోసం పని చేస్తుందని, మీ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి యురేనియం తవ్వకాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం లేకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం పద్ధతి కాదని, ప్రజలు గమనించాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు విజ్ఞప్తి చేశారు. యురేనియం తవ్వకాలు చేస్తే తమ కంబలపాడు గ్రామం కూడా నష్టపోతుందని, ఇది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు.