TIRUPATHI: ఇక "గ్రేటర్" తిరుపతి
గ్రేటర్గా మారనున్న పవిత్ర నగరం తిరుపతి... గ్రేటర్ తిరుపతికి నగరపాలక సంస్థ ఆమోదం
తిరుపతి పేరు వినగానే గుర్తొచ్చేది శ్రీ వెంకటేశుడే. గోవిందుని నామ స్మరణతో తిరుపతిలోని తిరుమల కొండలు అనునిత్యం మారుమ్రోగిపోతుంటాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నిత్యం లక్షలాది మంది తిరుపతి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలతో పాటు తిరుపతిలో బస చేస్తారు. కేవలం తిరుమలేశుడినే కాకుండా చుట్టూ ఉన్న ప్రముఖ దేవాలయాలను కూడా సందర్శిస్తారు. ఇలా ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, పర్యాటకంగా ఎంతో ప్రాశస్త్యం పొందిన తిరుపతి నగరం మరింత విస్తరించనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తిరుపతి నగరపాలక సంస్థ పాలక మండలి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం 30.17 చదరపు కిలో మీటర్లు ఉన్న తిరుపతి నగరం కాస్త సుమారు 300ల చదరపు కిలో మీటర్లకు విస్తరించనుంది. సీఎం చంద్రబాబు తిరుపతి నగర అభివృద్ధిపై తొలి నుంచీ శ్రద్ధాసక్తులు చూపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో నారావారిపల్లికి వచ్చిన సందర్భంలో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్కు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అందులో గ్రేటర్ తిరుపతి ఒకటి. అప్పట్నుంచి జిల్లా యంత్రాంగం దీనిపై కసరత్తు ప్రారంభించింది. భౌగోళికంగా ప్రజలకు గానీ, అధికార యంత్రాంగానికి గానీ అసౌకర్యం కలగని రీతిలో తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మారనున్న తిరుపతి రూపురేఖలు
గ్రేటర్గా మారితే తిరుపతి నగర రూపురేఖలు అనూహ్యంగా మారిపోనున్నాయి. ఇపుడు కేవలం 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన తిరుపతి.. 284 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 4.50 లక్షల జనాభా 7.50 లక్షలకు పెరగనుంది. రూ.149 కోట్లుగా ఉన్న వార్షికాదాయం రూ.182 కోట్లకు చేరనుంది. చంద్రగిరి, రేణిగుంట వంటి మేజర్ పంచాయతీ కేంద్రాలు తిరుపతిలో అంతర్భాగం కావడంతో పాటు విమానాశ్రయం వెలుపలున్న వికృతమాల దాకా నగరం విస్తరించనుంది. చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలకు చెందిన పంచాయతీలు తిరుపతి కార్పొరేషన్లో విలీనం కావడం పట్ల ఎమ్మెల్యే పులివర్తి నానీకి అభ్యంతరమేమీ లేదని సమాచారం. తిరుపతి అభివృద్ధి పట్ల ఆయనకూ ఆసక్తి ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే రాజకీయ కోణం నుంచి చూసినప్పుడు పంచాయతీల విలీనం కారణంగా ఆయనపై స్థానిక నేతల నుంచీ తీవ్ర ఒత్తిడి ఎదరు కానుంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచు పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు తాజాగా గ్రేటర్ ప్రతిపాదనలు రావడంతో నిస్పృహ చెందుతున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే చంద్రగిరి నియోజకవర్గంలోని పంచాయతీల విలీనం పట్ల ఎమ్మెల్యే నానీ కొంత అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో పార్టీ నేతల సమాధానపడే అవకాశం ఉంది.