Tirupati Floods: ప్రమాదకరంగా మారిన రాయల చెరువు.. దీంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి..
Tirupati Floods: భారీ వర్షాలు, వరదలు.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిని వణికిస్తున్నాయి.
Tirupati Floods: భారీ వర్షాలు, వరదలు.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిని వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తిరుపతి నగరంలో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం రేపిన బీభత్సానికి తిరుపతి పూర్తిగా జలమయం కాగా.. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి నగరంలో ఎటుచూసినా చెరువును తలపిస్తోంది. కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
భారీ వర్షాలకు తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్లోకి సైతం వరద నీరు చేరింది. అలిపిరి నడకమార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. అటవీప్రాంతం నుంచి భారీగా వరద వస్తుండటంతో 500.. 600.. 800 మెట్లు వరద ప్రవహనికి కోతకు గురయ్యాయి.
భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని రాయల చెరువు ప్రమాదపు అంచుకు చేరింది. ఎగువ నుంచి వరద ప్రవాహం చేరడంతో రాయల చెరువుకు ఏ క్షణమైనా గండి పడే ప్రమాదముంది. దీంతో అప్రమత్తమైన అధికారులు చెరువు చుట్టుపక్కల 10 గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈమేరకు గ్రామాల్లో దండోరా వేయించారు. రాయల చెరువు తెగిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు గనుక గండి పడితే తమ గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
తిరుపతి రామచంద్రాపురంలో రాయలచెరువు ప్రమాదకరంగా మారింది.. వరద పోటుతో కట్ట కుంగిపోయింది.. దీంతో చెరువులోని నీరు బయటకు లీకవుతోంది.. మరోవైపు చెరువు కట్ట తెగిపోతోందంటూ నగరంలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. దీంతో జనం ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.. అటు రెవెన్యూ, పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి.. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు అధికారులు.