AI: కృత్రిమ మేధ.. ఉద్యోగాల కోత.. టెకీల బాధ
దూసుకుపోతున్న ఏఐ టెక్నాలజీ.. ఏఐ వల్ల ఇప్పటికే 60 వేల ఉద్యోగాల కోత;
ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ దూసుకుపోతోంది.. ఇప్పుడు ఎక్కడ విన్నా చూసినా మారుమోగుతోన్న మాట ఒక్కటే ఏఐ. ఈ ఏఐ వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడేలా చేస్తోంది. 2022 వ సంవత్సరం నుంచి టెక్ ఉద్యోగాలకు సవాలుగా మారిన ఏఐ... 2025 సంవత్సరం నాటికి దాదాపు 60 వేల మంది ఉద్యోగులను ఇండ్లకు పంపేసింది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయనుకుంటే.. అందుకు భిన్నంగా ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. బడా కంపెనీలు కూడా వేల సంఖ్యల్లో ఉద్యోగులను తీసేస్తుంటే చాలామంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి తలపట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 130 కంపెనీల్లో దాదాపు 60 వేల ఉద్యోగాలకు ఏఐ ఎసరు పెట్టింది. ఎఐ టెక్నాలజీపై ఆధారపడిన బడా బడా కంపెనీలన్నీ ఉద్యోగాలను పీకేస్తూ వేలాదిమంది జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉద్యోగాలను సృష్టిస్తుందనుకున్న ఈ కృత్రిమ మేధ వారి కోతకు కారణమవుతూ అంతకంతకు కలవరాన్ని రేపుతోంది. గతంలో సిఈఒ లు మాట్లాడుతూ … కృత్రిమ మేధతో ఎవ్వరి ఉద్యోగాలకు సమస్య రాబోదని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా లేఆఫ్లు ప్రకటిస్తున్నారు. గతేడాది టెక్ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మందిని ఇంటికి పంపేశాయి. 2023లో 2,64,220 మంది ఉద్యోగాలకు ఉద్వాసన పలికాయి. టెక్ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకాలు 50 శాతం పడిపోయినట్లు సిగల్ ఫైర్ నివేదికను వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్ నుంచి చిన్న కంపెనీ దాకా...
ప్రముఖ మెక్రోసాఫ్ట్ కంపెనీ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. గత నెలలో 6 వేలమందికి ఉద్వాసన పలికింది. ఇదే సంస్థ 2023లో అత్యధికంగా 10వేల మందిని ఉద్యోగాల్లో నుండి తీసేసింది. మార్కెట్లో పై చేయి సాధించడానికి అవసరమైన ఎఐ సాంకేతికతను వాడుతూనే ఉంటామని వారు చెబుతున్నారు. మళ్లీ తాజాగా మరో 3 వేలమంది ఉద్యోగాల తొలగింపుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ కూడా ఒక్క మే నెలలోనే 200మంది ఉద్యోగులను తొలగించింది. కేవలం ఎఐ కారణంగా … ఒక్క మే నెలలోనే 23 వేల 400ల ఉద్యోగాలకు కోత పడింది. అమెజాన్ 2025 మే నెలలో 100మంది ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. 2022 నుండి మొత్తంగా 27 వేలమందిని తొలగించింది. ఇంటెల్ సంస్థ కూడా దాదాపు 21 వేలమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యింది.