META: స్కేల్ ఏఐలో మెటా రూ.85,000 కోట్ల పెట్టుబడి
ఏఐ రంగంలో అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడిగా నిలవనున్న మెటా;
కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు రూపొందించే అమెరికాకు చెందిన అంకుర సంస్థ స్కేల్ ఏఐలో 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.85,000 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక దిగ్గజం మెటా ప్లాట్ఫామ్స్ తుదిదశ చర్చలు జరుపుతోందని వార్తా సంస్థ బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ఇది ఖరారైతే, ఏఐలో మెటాకు ఇదే అతిపెద్ద పెట్టుబడి కానుంది. ఏఐ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడిగా కూడా నిలవనుంది. ఈ లావాదేవీ ఇంకా కొలిక్కి రాలేదని, ఇంకా చర్చలు జరుగుతున్నందున.. మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దీనిపై మెటా, స్కేల్ ఏఐ ఎటువంటి ప్రకటనలు చేయలేదు.
స్కేల్ ఏఐను 2016లో అలెగ్జాండర్ వాంగ్ స్థాపించారు. మెషీన్ లెర్నింగ్ మోడళ్ల శిక్షణ కోసం డేటా లేబులింగ్ సేవలు అందించడంలో స్కేల్ ఏఐ ప్రత్యేక స్థానం ఉంది. ఏఐ అప్లికేషన్లనూ ఈ సంస్థ రూపొందిస్తోంది. గత ఏడాదికల్లా వేగంగా వృద్ధి చెందిన కంపెనీ, 870 మి.డాలర్ల ఆదాయాన్ని నమోదుచేసింది. 2025లో కంపెనీ ఆదాయం 2 బిలియన్ డాలర్లకు చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 2024 మే నెలకు స్కేల్ ఏఐ విలువ 13.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కంపెనీలో అమెజాన్, మెటా, ఎన్విడియా వంటి సంస్థలకు పెట్టుబడులు ఉన్నాయి.