GOLD: బంగారు రుణాలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు
గోల్డ్ లోన్స్పై కఠిన నిబంధనలు... ఆర్బీఐ రూల్స్పై దేశవ్యాప్తంగా చర్చ;
గ్రామీణ భారతంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఆర్థిక బలంగా నిలిచే బంగారు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రతిపాదించిన మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. గోల్డ్ లోన్కు సంబంధించి మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలన్న ఆర్బీఐ యోచనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. చిన్న మొత్తంలో రుణాలను అవసరపడే సామాన్యులకు ఇది భారం అవుతుందని అభిప్రాయపడింది.
ఆర్బీఐ ప్రతిపాదించిన కీలక మార్పులు
లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తిని 75 శాతానికి పరిమితం చేయడం. అంటే బంగారం విలువలో 75% మాత్రమే రుణంగా పొందే అవకాశం.
పూచీకత్తులపై కఠిన నియంత్రణలు, నిజమైన, ధ్రువీకరించదగిన ఆస్తుల ఆధారంగా మాత్రమే రుణ మంజూరు.\
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై పర్యవేక్షణను పెంచడం, రుణాల మంజూరులో పారదర్శకతకు పూనిక.\
ఈ మార్పులు ప్రధానంగా పెద్ద మొత్తాల రుణాలపై దృష్టి పెట్టినప్పటికీ, చిన్నమొత్తం రుణాలు తీసుకునే వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం జోక్యం – సామాన్యులకు ఊరట
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆర్బీఐ ప్రతిపాదనలపై పునఃపరిశీలన కోరుతూ కీలక సూచనలు చేసింది. రూ. 2 లక్షల లోపు బంగారు రుణాలను ఈ కఠిన నిబంధనల నుండి మినహాయించాలని సూచించింది, తద్వారా చిన్న రుణగ్రహీతలు ఇబ్బంది పడకుండా రుణాలు పొందే అవకాశముంటుంది. నిబంధనల అమలుకు కుదిరే సమయం ఇవ్వాలని కోరుతూ, వాటిని 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని సూచించింది.