PHONE PE: మరో కీలక ముందడగులు వేసిన ఫోన్‌ పే

ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకు యూపీఐ సేవలను అందించేందుకు కీలక ముందడుగు;

Update: 2025-06-07 05:30 GMT

డిజిటల్‌ చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థ ఫోన్‌పే మరో కీలక అడుగు వేసింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు మాత్రమే పరిమితమైన యూపీఐ సేవలను ఇప్పుడు ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకూ అందించేందుకు రంగంలోకి దిగింది. ఇందుకోసం ఫోన్‌పే, గప్‌చుప్‌ అనే జీఎస్‌పే టెక్నాలజీ ఆధారిత కన్వర్సేషనల్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఫోన్‌పే వెల్లడించిన వివరాల ప్రకారం, రానున్న త్రైమాసికాల్లో భారత్‌లో వినియోగంలో ఉన్న ఫీచర్ ఫోన్ల కోసం ప్రత్యేక యూపీఐ మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు పీర్‌-టు-పీర్‌ (P2P) లావాదేవీలు, ఆఫ్‌లైన్ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు, అలాగే మొబైల్ నంబర్‌ లేదా యూపీఐ ఐడీ ఆధారంగా ఇతరులకు డబ్బు పంపించవచ్చు.

జీఎస్‌ పే పరిచయం:

ఫోన్‌పే ప్రవేశపెట్టబోయే ఈ సేవలలో భాగంగా జీఎస్‌ పే టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ఇది నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూపీఐ 123పే సేవలకు మద్దతుగా పనిచేస్తుంది. ఫీచర్‌ ఫోన్లను ఉపయోగించే వినియోగదారులకు యూపీఐ ఆధారిత సులభమైన చెల్లింపు ఎంపికలను అందించడమే దీని లక్ష్యం. ప్రస్తుతం గప్‌చుప్‌ యాప్‌ ఫీచర్‌ ఫోన్లలో అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఖాతా నంబర్‌, IFSC కోడ్‌ను ఎంటర్‌ చేసి బ్యాంక్ ఖాతాను లింక్‌ చేయవచ్చు. లింక్ అయిన వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్‌ వస్తుంది. అనంతరం యాప్‌లోని "పే" ఫీచర్‌ ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. ఈ నేపథ్యంలో, ఫోన్‌పే త్వరలోనే గప్‌చుప్‌ స్థానంలో తన కొత్త యాప్‌ను తీసుకురానుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఫీచర్‌ ఫోన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై స్పందించిన ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సమీర్‌ నిగమ్‌ మాట్లాడుతూ, "డిజిటల్ చెల్లింపులు అందరికి అందుబాటులో ఉండాలి. ఫీచర్‌ ఫోన్ వినియోగదారులకూ ఇది సమానంగా అందించేందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం" అని పేర్కొన్నారు.

Tags:    

Similar News