RBI: పొదుపు ఖాతాలపై వడ్డీ తగ్గింపు
పొదుపు ఖాతాలపై వచ్చే ఆదాయం మరింత తగ్గింపు;
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. దాని ప్రభావంతో దేశంలోని ప్రముఖ బ్యాంకులు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ – తమ సేవింగ్స్ ఖాతాలపై చెల్లించే వడ్డీ రేట్లను కుదించారు. దీంతో ఇప్పటికే తక్కువగా ఉన్న పొదుపు ఖాతాలపై వచ్చే ఆదాయం మరింత తగ్గనుంది. ఈ ఏడాది మొత్తం వడ్డీ కోతలు కలిపితే సుమారు 1 శాతం వరకూ తగ్గాయి. ఈ మార్పులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకులన్నీ స్వీకరించడంతో డిపాజిటర్ల ఆదాయంపై నేరుగా ప్రభావం పడుతోంది.
ఎస్బీఐ తాజా నిర్ణయం:
దేశ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 15 నుంచి తన పొదుపు ఖాతాలపై వర్తించనున్న వడ్డీ రేటును సంవత్సరానికి 2.5 శాతానికి తగ్గించింది. గతంలో రూ.10 కోట్లలోపు బ్యాలెన్స్పై 2.7 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్పై 3 శాతం వడ్డీ అందించేది. రెండు స్థాయిలను ఒకే వడ్డీ రేటును ప్రవేశపెట్టింది.
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ రేట్లలో మార్పు:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ 10 నుంచి సేవింగ్స్ ఖాతాలపై చెల్లించే వడ్డీని 2.75 శాతానికి కుదించింది. గతంలో రూ.50 లక్షలలోపు ఖాతాలకు 2.75 శాతం, అతికొద్ది మంది ఉన్న రూ.50 లక్షలపైగా బ్యాలెన్స్లకు 3.25 శాతం వడ్డీ అందించేది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా అదే విధంగా జూన్ 12 నుంచి అన్ని స్థాయిల ఖాతాలపై వడ్డీని 2.75 శాతంగా చేసింది.
పెట్టుబడుల వైపు దృష్టి:
ఈ నేపథ్యంలో నిపుణులు యూత్కు సూచిస్తున్న విషయం ఏమిటంటే – కేవలం పొదుపు ఖాతాల్లో డబ్బు ఉంచడమే కాకుండా, అది పెరిగే మార్గాలను అన్వేషించాలి. పొదుపు ఖాతా డబ్బును సురక్షితంగా ఉంచినా, ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ తగ్గుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ రాబడి వచ్చే పెట్టుబడి పథకాల వైపు మొగ్గుచూపాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు, ఎక్కువ వడ్డీ ఇచ్చే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్లు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (SIP), లేదా స్టాక్ మార్కెట్లో ఫ్రాక్షనల్ షేర్స్ వంటి వాటిలో చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు.
పెట్టుబడి పెట్టడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు. ముఖ్యంగా యువత ఎంత త్వరగా ప్రారంభిస్తే, వారి ఆర్థిక భవిష్యత్తు అంత బలంగా నిర్మించుకోవచ్చు. కాంపౌండింగ్ శక్తి ద్వారా చిన్న మొత్తాలే ఎక్కువ కాలంలో గొప్ప ఫలితాలు ఇవ్వగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.