SHARES: 30 ఏళ్ల కిందటి షేర్లు... ఇప్పుడు రూ.80 కోట్లు!
అదృష్టం అంటే ఇదే.. లక్ష రూపాయలకు 80 కోట్లు;
అదృష్టం ఎప్పుడు, ఎక్కడ, ఎలా తలుపుతట్టుతుందో ఊహించలేం. తాజాగా ఓ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిన ఘట్టం దీనికి ఉదాహరణ. 1990వ దశకంలో తన తండ్రి రూ.1 లక్షకు కొనుగోలు చేసిన JSW Steel షేర్ల విలువ, ఇప్పుడు రూ.80 కోట్లకు చేరింది. ఆ షేర్ సర్టిఫికెట్లు ఇటీవల అతడి కుమారుడికి అనుకోకుండా దొరకగా, తండ్రి పెట్టుబడి ఇప్పుడు తరం మారిపోయే సంపదగా మారింది. ఈ ఆసక్తికర విషయాన్ని ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ‘X’ (మాజీ ట్విట్టర్)లో షేర్ చేస్తూ, “సరైన సమయంలో కొనడం, వాటిని జాగ్రత్తగా నిల్వచేసుకోవడం, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టడం ఎంత విలువైనదో ఇది చెబుతోంది” అన్నారు. ఆదాయంలో కొంత భాగాన్ని స్టాక్ మార్కెట్లు పెట్టుబడి రూపంలో మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిరీక్షణే నిధి!
30 ఏళ్ల క్రితం చేసిన పెట్టుబడి విలువ ఇప్పుడు పదుల కోట్ల రూపాయలు కావడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పవర్ను మరోసారి రుజువు చేస్తోంది. చాలా మంది నెటిజన్లు ఈ కథను ఆశ్చర్యంగా స్వీకరించగా, కొంతమంది దీన్ని “పెట్టుబడి కాదు – వారసత్వ సంపద”గా అభివర్ణించారు. దేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలలో JSW స్టీల్కు కీలక స్థానం ఉంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేర్ ధర రూ.1004.90, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.37 లక్షల కోట్లు. ఈ కంపెనీ షేర్లు కొన్ని దశాబ్దాలుగా స్థిరంగా పెరుగుతూ, ఇన్వెస్టర్లకు అధిక రాబడులను అందిస్తున్నాయి. నేటి చిన్న పెట్టుబడే రేపు కోట్ల విలువైన భవిష్యత్తుగా మారవచ్చు.