FED Rate : ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపు.. ఆల్టైమ్ హైకి స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ గరిష్ఠాల వద్ద ముగిశాయి. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం దేశీయ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫెడ్ నిర్ణయం నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు భారీగా పెరిగాయి. ప్రారంభంలో 30 షేర్ల సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పెరిగింది. మరో వైపు నిఫ్టీ సైతం తొలిసారిగా 25,500 పాయింట్ల మార్క్ను అధిగమించింది. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 83,359.17 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. అదే ఊపును కొనసాగిస్తూ సెన్సెక్స్ 83,773.61 పాయింట్లకు చేరి ఆల్టైమ్ హైకి చేరుకున్నది. అయితే, మధ్యాహ్నం వరకు స్వల్పంగా తగ్గింది. చివరకు 236.57 పాయింట్ల లాభంతో 83,184.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 25,487.05 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. తొలి సెషన్లోనే 25,611.95 పాయింట్ల రికార్డు స్థాయికి చేరింది. చివరకు 38.25 పాయింట్ల లాభంతో 25,415.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఫార్మా, ఆయిల్, గ్యాస్, మీడియా, మెటల్, టెలికాం 0.5-3.5 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్క్యాప్ సూచీలు ఒకశాతం వరకు తగ్గాయి.