TAX: కొత్త పన్ను విధానంలో "జీరో" ట్యాక్స్
ప్రతి ఏడాది చెల్లించాల్సిన ఆదాయపు పన్ను... గతేడాది అమలులోకి కొత్త పన్ను విధానం... కొత్త పన్ను విధానంలో జీరో ట్యాక్స్.. ఎఫ్డీల ద్వారా కొంత అదనపు ఆదాయం;
నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు ప్రతి ఏడాది ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ అనేది పన్ను శ్లాబుల ప్రకారం కట్టాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్త పన్ను విధానం అమలులోకి తీసుకొచ్చింది. పాత, కొత్త అనే రెండు విధానాలూ అమలులో ఉన్నాయి. అయితే, ఏది ఎంచుకోవాలనేది ట్యాక్స్ పేయర్లు నిర్ణయించుకోవాలి. తమకు ఏది అనుకూలంగా ఉంటే అది ఎంచుకోవచ్చు. వ్యక్తిగత ఆదాయపు పన్ను ఆదా చేసుకోవాలనుకుంటున్న వారిలో చాలా మంది కొత్త పన్ను విధానంలోకి మారిపోతున్నారు. పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త విధానంలో ఎలాంటి పెట్టుబడులు లేకుండానే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. మరి రూ.12.20 లక్షల ఆదాయం ఉంటే ఏ విధంగా రెండు పన్ను విధానాల్లో పన్ను పడుతుంది? కొత్త విధానంలో జీరో ట్యాక్స్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం.
కొత్త పన్ను విధానంతో నో ట్యాక్స్
ఉదాహరణకు ఒక వ్యక్తి హోమ్ లోన్ తీసుకోవడంతో పాటు కొన్ని పన్ను ఆదా పెట్టుబడులు పెట్టాడు అనుకుందాం. అతను వీటి కారణంగా పాత పన్ను విధానంలోనే కొనసాగుతుంటారు. అయితే, అతను కొత్త పన్ను విధానంలోకి మారడం ద్వారా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. పాత పన్ను విధానంలోనే కొనసాగితే పన్ను కట్టాల్సి వస్తుంది. సదరు వ్యక్తి జీతం రూ.12 లక్షలు ఉందని అనుకుంటే ఎఫ్డీల ద్వారా కొంత అదనపు ఆదాయం పొందుతుంటే హోమ్ లోన్ తీసుకున్న కారణంగా ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చేది. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఈఎల్ఎస్ఎస్ వంటి పన్ను ఆదా పెట్టుబడులు పెట్టారు.
స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలు
ఇలా కొన్ని పన్ను ఆదా పెట్టుబడులు, మినహాయింపులతో పాత పన్ను విధానం ఎంచుకుంటే ఇంకా రూ.79,560 వరకు పన్ను కట్టాల్సి వస్తుంది. కొత్త విధానంలో ఇలాంటి \స్పెషల్ మినహాయింపులు ఉండవు. కానీ, ఇందులో ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.75 వేలుగా ఉంటుంది. పన్ను శ్లాబులు ఎక్కువగా ఉంటాయి. రేట్లు తక్కువ ఉంటాయి. కొత్త పన్ను విధానం ద్వారా జీరో ట్యాక్స్ పడుతుంది. అంటే రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు.
పాత విధానంలో క్లెయిమ్
ఓ వ్యక్తికి వార్షిక ఆదాయం రూ.12,20,000 ఉందని అనుకుంటే ప్రామాణిక తగ్గింపు పాత పన్ను విధానంలో రూ.50 వేలు, కొత్త పన్ను విధానంలో రూ.75వేలు ఉంటుంది. సెక్షన్ 80సీ ద్వారా రూ.1.50 లక్షలు మినహాయింపులు పాత పన్ను విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త విధానంలో ఉండదు. హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలకు పాత విధానంలో మినహాయింపు ఉంటుంది. కొత్త విధానానికి వర్తించదు. పాత పన్ను విధానంలో మొత్తం మినహాయింపులు రూ.4 లక్షలు అవుతాయి. అంటే ఇంకా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.8.20 లక్షలు అవుతుంది. దీనిపై చెల్లించే పన్ను రూ.79,650 వరకు ఉంటుంది. అయితే కొత్త పన్నువిధానంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.11,45,000 అవుతుంది. అయితే సెక్షన్ 87ఏ రిబేట్ ద్వారా ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఇది హోమ్ లోన్ తీసుకుని వడ్డీ చెల్లిస్తున్నప్పుడు క్లెయిమ్ చేస్తే మాత్రమే వర్తిస్తుంది. అయితే ఆదాయపు పన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ కొత్త పన్ను విధానంలో పన్ను ఆదా అవుతుందని కచ్చితంగా చెప్పలేం. ఆదాయం మొత్తం, పన్ను మినహాయింపులు లాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని రెండు విధానాల్లో పన్ను మొత్తాన్ని లెక్కించిన తరువాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.