ఇరవై నాలుగేండ్ల కిందట వచ్చిన ‘రెఫ్యూజీ’ మూవీతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కరీనాకపూర్. ఆ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ కరీనా యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు సైతం యావరేజ్ టాక్ నే తెచ్చుకున్నాయి. 2003లో వచ్చిన కబీ ఖుషీ.. కబీ గమ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే, 2007లో వచ్చిన ‘జబ్ వియ్ మెట్’ సినిమా కరీనాకు కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఆమె సెటైల్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన త్రీ ఇడియట్స్, బాడీ గార్డ్, గోల్ మాల్3 సినిమాలు వరుసగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో కరీనా క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే, పెళ్లి తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న కరీనా కపూర్.. ఈ ఏడాది ‘క్రూ’ సినిమాతో అలరించింది. అయితే, తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క సౌత్ ఇండియన్ మూవీలో కూడా నటించని కరీనా.. ఇప్పుడు ఏకంగా భారీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న మూవీలో కరీనా నటించనున్నట్లు సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ నటిస్తోన్న, మహేశ్, రాజమౌళి కాంబోలో రాబోయే ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో ఒకదానికి ఆమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో యాక్షన్ డ్రామాగా సిద్ధం కానుంది. ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. 2026లో విడుదల కానుంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. మహేశ్బాబు, రాజమౌళి కాంబోలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ‘గరుడ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో కరీనాకపూర్ నటించనున్నారని.. ఇప్పటికే మూవీ టీమ్ ఆమెను కన్సల్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిపై కరీనాకపూర్ టీమ్ రెస్పాన్స్ అవ్వలేదు. ఆయా సినిమాల మేకర్స్ నుంచి సైతం ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.