కోమలి ప్రసాద్ నటిగా తెలుగు తెరపై తనకు వచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతోన్నారు. ఈలోపు కోమలి ప్రసాద్ మీద సోషల్ మీడియా, మీడియాలో ఓ అసత్య ప్రచారం మొదలైంది. యాక్టింగ్ కెరీర్ను వదిలి పెట్టారని, డాక్టర్ వృత్తిలోకి వెళ్లారని కోమలి ప్రసాద్ మీద రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో ఈ వార్తల్ని ఖండిస్తూ కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.
‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాను.
నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా ఈ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టతనిస్తూ పోస్ట్ వేస్తున్నాను. ఆ విధే నన్ను ఈ మార్గంలోకి తీసుకు వచ్చిందని నేను భావిస్తుంటాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను. త్వరలో కొత్త ప్రకటనలతో మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తాను’ అని కోమలి ప్రసాద్ అన్నారు.