రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు
ర్యాలీలు, ధర్నాలు చేయొద్దని రజనీకాంత్ చెప్పారు.
రాజకీయాల్లోకి రాలేనని రజనీకాంత్ మరోసారి స్పష్టీకరించారు. తనను రాజకీయాల్లోకి రావాలని బలవంతపెడుతూ ఆందోళనలు, ధర్నాలు చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేయొద్దని ఓ లేఖను విడుదల చేశారు. ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రాలేనని.. అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. ర్యాలీలు, ధర్నాలు చేయొద్దని చెప్పారు. రాజకీయ ప్రవేశంపై మనసు మార్చుకునే అవకాశం లేదని తేల్చిచెప్పారు. నిన్నటి వళ్లువర్కోట్టంలో ఆందోళనలో పాల్గొనని అభిమానులకు రజనీకాంత్ అభినందనలు తెలిపారు.
ఆదివారం చెన్నైలోని వళ్లువర్కోట్టంలో అభిమానులు ధర్నా నిర్వహించారు. తలైవా మనసు మార్చుకోవాలని కోరారు. రాజకీయాల్లో మార్పు ఇప్పుడు సాధ్యం కాకపోతే.. ఎప్పటికీ సాధ్యం కాదన్న రజనీ వ్యాఖ్యలతో నినాదాలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించిన నాటి నుంచి అభిమానులు వివిధ రూపాల్లో తమ మనోగతాన్ని తలైవా దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమాన నేతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానించేందుకు తాపత్రయపడుతున్నారు. కానీ.. రజనీకాంత్ మాత్రం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా..రాజకీయాల్లోకి రాలేనంటూ తేల్చి చెప్పారు.