హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) చిత్ర పరిశ్రమలో దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం పూర్తిచేసుకుంటోంది. 2009లో 'జిల్లీ' అనే కన్నడ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఫిబ్రవరి 21న జరిగింది. ఐనప్పటికీ సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.
తాజాగా రకుల్ ప్రీత్ నటించిన చిత్రం 'భారతీయుడు 2'. కమల్ హాసన్ ( Kamal Haasan ) హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన 'భారతీయుడు 2' మూవీలో కీలక పాత్ర పోషించారామె. ఈ నెల 12న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది.
"'భారతీయుడు 2' సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ చిత్రం కోసం విలక్షణ నటులు కమల్ హాసన్ సర్ తో, గొప్ప దర్శకుడైన శంకర్ సర్తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. షూటింగ్ సమయంలో శంకర్ సర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు. తెరపై కథలని, పాత్రలను ఆయన చూపించే విధానం అద్భుతం. శంకర్ ఆలోచనా విధానం, సృజనాత్మకత గురించి ఎంత చెప్పినా తక్కువే" అన్నారు. రకుల్ నటించిన హిందీ సినిమాలు 'మేరీ పతీకా రీమేక్. దే దే ప్యార్ దే 2' త్వరలో రిలీజ్ కానున్నాయి.