Disha Patani : దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు నిందితుల ఎన్కౌంటర్
బాలీవుడ్ నటి దిశా పటానీ నివాసం వద్ద ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారని ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దిశా పటానీ ఇంటిపై కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎక్కడి నుంచైనా పట్టుకుని శిక్షిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం ఘజియాబాద్లోని ట్రోనికా సిటీలో ఈ ఇద్దరు నిందితులను గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు, నిందితుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు నిందితులను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు మరణించారు. వారిని రవీంద్ర, అరుణ్గా పోలీసులు గుర్తించారు. వారు రోహిత్ గోదారా - గోల్డీ బ్రార్ ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు తుపాకులు, పెద్ద మొత్తంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ గతంలో ప్రకటించింది. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా ఆరా తీశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని దిశా పటానీ తండ్రి మీడియాకు తెలిపారు.