అమెరికాలో దారుణం.. భారత సంతతి వ్యక్తి తల నరికిన దుండగుడు

Update: 2025-09-12 06:30 GMT

అమెరికాలోని డల్లాస్‌లో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కేవలం ఒక చిన్న గొడవ కారణంగా దుండగుడు ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల కళ్ళ ముందే ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం..భారత సంతతి కి చెందిన 50 ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్య అనే వ్యక్తిని యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్‌ అనే అమెరికా కు చెందిన వ్యక్తి అత్యంత దారుణంగా కత్తి తో తల నరికి హత్య చేశాడు. ఈ నెల 10న ఈ దారుణం జరగగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోబోస్-మార్టినెజ్ తన సహోద్యోగితో కలిసి మోటెల్‌లోని ఒక గదిని శుభ్రం చేస్తుండగా, చంద్రమౌళి అక్కడికి వెళ్లారు. అప్పటికే పాడైపోయిన వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించవద్దని చంద్రమౌళి వారికి సూచించారు.

అయితే.. ఈ విషయాన్ని చంద్రమౌళి కోబోస్ కు కాకుండా పక్కనే ఉన్న మహిళకు చెప్పడంతో కోబోస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను కాదని ఆమెతో మాట్లాడటాన్ని అవమానంగా భావించాడు. తన వద్ద ఉన్న కత్తితో చంద్రమౌళిపై దాడికి పాల్పడ్డాడు. ప్రాణ భయంతో చంద్రమౌళి మోటెల్ పార్కింగ్ స్థలంలోకి పరుగులు తీసినా, నిందితుడు అతన్ని వదలకుండా వెంటాడి, కత్తితో దాడి చేశాడు. అరుపులు విని బయటకు వచ్చిన చంద్రమౌళి భార్య, కొడుకు అతన్ని కాపాడటానికి ప్రయత్నించారు. కానీ నిందితుడు వారిని పక్కకు తోసేసి, చంద్రమౌళి తల నరికేశాడు. అనంతరం తెగిపడిన తలను కాలితో తన్ని, చెత్తకుండీలో పడేసేందుకు ప్రయత్నించాడు.

ఈ దారుణాన్ని గమనించిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఈ నేరం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Tags:    

Similar News