ఇంజినీరింగ్ విద్యార్థినిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
విద్యార్థిని.. సూసైడ్ చేసుకోవడంతో క్లాస్మేట్లు కూడా షాక్కి గురయ్యారు.
మేడ్చల్ జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ముందు అనుమానాస్పద మృతిగా భావించినా.. సీసీ ఫుటేజ్ పరిశీలించాక ఇది సూసైడ్గా నిర్థారణకు వచ్చారు. విద్యార్థిని.. హాస్టల్ భవనం పైనుంచి దూకుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చదువులో వెనుకబడుతున్నాను అనే కారణంగానే మనస్తాపంతోనే సూసైడ్ చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడ్డ చంద్రిక స్వస్థలం మిర్యాలగూడ. కుమార్తె మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కరోనా తర్వాత ఇటీవలే కాలేజీ తెరవవడంతో తిరిగి క్లాస్లకు హాజరవుతున్న విద్యార్థిని.. సూసైడ్ చేసుకోవడంతో క్లాస్మేట్లు కూడా షాక్కి గురయ్యారు.
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో చంద్రిక సివిల్ ఇంజినీరింగ్ 4వ ఏడాది చదువుతోంది. స్థానికంగా మైసమ్మగూడలోని కృప హాస్టల్లో ఉంటోంది. ఇవాళ.. ఉదయం హాస్టల్లో తోటివారు లేచి చూసేసరికి హాస్టల్ అనుమానాస్పద స్థితిలో చంద్రిక పడి ఉండడం గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పేట్ బషీర్బాద్ ఏసీపీతోపాటు క్లూస్ టీమ్ అక్కడకు చేరుకుని స్పాట్ను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ చూశాక జరిగింది ఆత్మహత్యగా నిర్థారణకు వచ్చారు.