సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆరు రోజుల పాటు వారిని విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. మొదటి రోజు యుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను విచారిస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.
అటు.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిశారు హేమంత్ భార్య అవంతి, కుటుంబ సభ్యులు. గచ్చిబౌలి పోలీసులు అవంతితో పాటు హేమంత్ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని ఇప్పటికే నమోదు చేశారు. ప్రేమ, పెళ్లి తదనంతర పరిణామాలకు సంబంధించి వారు చెప్పిన అన్ని వివరాలను పోలీసులు నమోదు చేశారు. హేమంత్ కిడ్నాప్ అయినప్పుడు రక్షించడానికి పోలీసులు కృషి చేసినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు అవంతి.
అనుమానిత వ్యక్తులు నిత్యం తమ రాకపోకలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు అవంతి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చందానగర్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. తారానగర్లోని ఇంటి వద్ద పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. 24 గంటలూ భద్రత కల్పిస్తామని చెప్పారు.