SUICIDE : ప్రియురాలి ఇంట్లో ఉరి వేసుకున్న లైవ్ బ్యాండ్ అధినేత
ఆర్థిక సమస్యలతో లైవ్బ్యాండ్ ఓనర్ ప్రియురాలి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు
ఆర్థిక సమస్యలతో ఓ లైవ్బ్యాండ్ ఓనర్ తన ప్రియురాలి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు నగరంలోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని మృతి చెందాడు.
తుమకూరు రోడ్డులోని అడకమారనహళ్లిలో నివాసం ఉంటున్న నగేష్ (28) అనే యువకుడు ఆర్థిక సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు. సర్ MV విశ్వేశ్వరయ్య లేఅవుట్ సమీపంలోని ముద్దనహళ్లిలో హైదరాబాద్కు చెందిన తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన నగేష్ అర్దరాత్రి దాటిన తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్ పురా తాలూకాకు చెందిన నగేష్ తన కుటుంబంతో కలిసి అడకమారనహళ్లిలో నివాసం ఉండేవాడు. ఏడేళ్ల క్రితం లైవ్ బ్యాండ్లో హైదరాబాద్కు చెందిన ఓ యువతితో నాగేష్ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. వివాహం చేసుకోకుండానే సహజీవనం చెయ్యడంతో వారికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడని పోలీసులు అంటున్నారు.
నగేష్ అతని స్నేహితుడితో కలిసి బెంగళూరులోని MG రోడ్డులో లైవ్ బ్యాండ్ నడుపుతున్నాడు. అయితే ఇటీవల ఈ లైవ్ బ్యాండ్ను పోలీసులు నిషేధించారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో నాగేష్ సతమతయం అయ్యాడని తెలిసింది. రాత్రి 11.30 గంటలకు ప్రియురాలి ఇంటికి వెళ్లిన నాగేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్నేహితురాలు వెంటనే అతడిని రక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే అంతలోనే నగేష్ తుది శ్వాస విడిచాడని పోలీసులు వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని, నగేష్ ప్రియురాల చెప్పిన వివరాల ఆధారంగా పూర్తి సమచారం సేకరిస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.