గుంటూరు జిల్లాలో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్(22), శైలజ(21)గా గుర్తించారు. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్.. రెండేళ్ల క్రితం హైదరాబాద్లో ఓ మొబైల్ స్టోర్లో పని చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా సమయంలో శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్పై విగత జీవులుగా కనిపించారు.