ఆలయాల దగ్గర ఉండే కోతులు... భక్తుల చేతుల్లోని కొబ్బరి చిప్పలు, ప్రసాదాలు, పలు వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. ఉత్తరప్రదేశ్లోని ఓ ఆలయంలో ఓ కోతి అదే చేసింది. భక్తుల చేతిలోని పర్సును ఎత్తుకెళ్లింది. అది మామూలు పర్సు కాదు. అందులో రూ. 20 లక్షల విలువైన నగలు ఉన్న పర్సు. దీంతో బాధితులకు ఏం చేయాలో తోచక పోలీసులను సంప్రదించారు. తీవ్రంగా గాలించిన పోలీసులు చివరకు పర్సును గుర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో చోటుచేసుకుంది. అలీఘర్కు చెందిన అభిషేక్ అగర్వాల్ తన కుటుంబీకులతో కలిసి బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి వచ్చాడు. గుడిలో దొంగలు ఉంటారని భయంతో తన భార్య నగలను తీసి పర్సులో పెట్టుకున్నారు. గుడి నుంచి తిరిగివస్తుండగా అక్కడే కాపుసిన కోతి ఆ రూ. 20లక్షల విలువైన నగలు ఉన్న బ్యాగ్ను తీసుకుని పారిపోయింది. బాధితులు దాని కోసం తీవ్రంగా శ్రమించి వెతికారు. ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కోతి, బ్యాగ్ కోసం తీవ్రంగా గాలించారు. చాలా సేపు తర్వాత పర్సును పొదల్లో దొరికింది.