Online Betting: టీవీ చూస్తూ ఆన్లైన్ బెట్టింగ్ వేస్తే డబ్బు గోవిందా..
Online Betting: క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటేచాలు..కడప జిల్లాలో బెట్టింగ్కు తెర లేపుతున్నారు పందెం రాయుళ్లు.;
Online Betting: క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటేచాలు..కడప జిల్లాలో బెట్టింగ్కు తెర లేపుతున్నారు పందెం రాయుళ్లు. మ్యాచ్ స్టార్ట్తో .. అది ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా బెట్టింగ్ జరగాల్సిందే. జిల్లాకు చెందిన బెట్టింగ్ రాయుళ్లు..బెంగళూరు, గోవా, హైదరాబాద్కు చెందిన ప్రధాన నిర్వాహకులతో ఆన్లైన్ దందా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆన్నితానై వ్యవహరిస్తుండటంతోపాటు తలపండిన సాంకేతిక నిపుణుల సహకారంతో..ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల పంట పండుతోందని చెబుతున్నారు. అటు ఐటీ నిపుణుల మ్యాజిక్..పందెం కాసిన ఇతరులు ఆర్థికంగా చతికిలపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల తీరు నిపుణులనే ఆశ్చర్యపరుస్తోంది.
టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్...డైరెక్ట్ యాప్ గేమ్ రిలేకు మధ్య సుమారు 10 నుంచి 15 సెకన్ల తేడా ఉంటోంది. క్రికెట్ గ్రౌండ్ లో ఆటతీరు, ప్రధాన బుకీల డెన్కు టీవీ కంటే 15 సెకన్ల ముందే సమాచారం వెళ్లేలా ముందస్తు ప్లాన్ చేసుకుంటున్నారు యాప్ నిర్వాహకులు. ఇందుకు హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సర్వర్లను..పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వర్ల వ్యవస్థ..మైదానంలో ఆటను రెప్పపాటు కాలంలో ప్రోగ్రాంను బుకీల సర్వర్ లతో అనుసంధానిస్తోంది. దీంతో ఆట సరళిని టెలివిజన్ కంటే ముందే కేటుగాళ్ళు ముందే గ్రహించగల్గుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే టీవీలో క్రికెట్ ఆటను చూస్తూ..ఈ ఆన్లైన్ యాప్ లో రిక్వెస్ట్ పెడితే అసలుకే మోసం వస్తుందని అంటున్నారు నిపుణులు.
10 నుంచి 15 సెకన్ల ముందస్తు ఆటను నిపుణుల సహకారంతో ముందే గ్రహించిన మెయిన్ బుకీలు.. పంటర్లకు అనుకూలంగా వచ్చిన క్రికెట్ ఆటలోని బాల్, ఫోర్, సిక్సర్, ఔట్, టాస్ లాంటి పంటర్ల రిక్వెస్ట్ ను వారికి అనుకూలంగా వస్తే రిసీవ్ చేసుకోవటం.. వ్యతిరేకంగా వస్తే పంటర్ రిక్వెస్ట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పందెం కాసిన పంటర్ ఓడి.. జూదం నిర్వహిస్తున్న బుకీలు భారీగా లాభపడతున్నట్లు ఫలితాలు చూపిస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా.. బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపాల్సిన నిఘా వ్యవస్థలు అనుకున్న ఫలితాలు సాధించనట్లే కనిపిస్తోందంటున్నారు స్థానికులు. ఈ బెట్టింగ్ వ్యవస్థలో కీలకంగా మారి, స్లీపర్ సెల్స్ లా పనిచేస్తున్న జూదరుల జాడను మొదట్లోనే ఎందుకు పసిగట్టలేదని ప్రశ్నిస్తున్నారు.