ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ గర్భిణి సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో మృత్యువాత పడింది. ఆమెకు ఏడాది కిందట వివాహం జరిగింది. సరైన సమయంలో ప్రసవం జరగక గర్భిణీ మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మూడు రోజుల కిందట లింబుగుడా గిరిజన గ్రామానికి చెందిన వెడ్మా మనీషా అనే గర్భిణికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కాగజ్ నగర్ ఆస్పత్రిలో చేర్పించడానికి ప్రత్యేక వాహనంలో తీసుకు వెళుతుండగా, పాతచీలపెళ్లి గేటు వద్ద రోడ్డుపై నీరు నిలిచి పోవడంతో ఆ వాహనం వెళ్లలేకపోయింది.
అప్పటికే చీకటిపడటంతో అంతా వెనుదిరిగి పోయారు. ఆ మరుసటి రోజు శనివారం తొలుత డోలీ కట్టి కాగజ్ నగర్ ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే మెరు గైన వైద్యసేవలు నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె మృతిచెందింది.