దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. మూడు కోచ్ లలోఉన్న ప్యాసింజర్ల నుంచి విలువైన వస్తువులు, నగలను ఎత్తుకెళ్లారు. మహారాష్ట్రలోని లాతూరు రోడ్ జంక్షన్లో చోరీ జరిగినట్లు గుర్తించిన ప్యాసింజర్లు ఆందోళనకు గురయ్యారు. మూడు కోచ్ ల్లోనూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్యాసింజర్ల నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, డైమండ్ రింగ్స్ చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.