నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న టిప్పర్ డ్రైవర్..!
మార్చి 30న నిజామాబాద్ జిల్లా గ్రామీణ మండలం మల్లారం గ్రామ కార్యదర్శి ఉమాకాంత్ను టిప్పర్ ఢీకొనడంతో చనిపోయారు.
ఒకే టిప్పర్.. ఒకే డ్రైవర్ కారణంగా 12 రోజుల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30న నిజామాబాద్ జిల్లా గ్రామీణ మండలం మల్లారం గ్రామ కార్యదర్శి ఉమాకాంత్ను టిప్పర్ ఢీకొనడంతో చనిపోయారు. ఆ కేసులో పోలీసులు టిప్పర్ను స్వాధీనం చేసుకొని డ్రైవర్ గంగాధర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే రోజు గంగాధర్ బెయిల్ పై విడుదలయ్యాడు. టిప్పర్ను మూడ్రోజుల కిందట తిరిగి అప్పగించారు.
అయినా అదే నిర్లక్ష్యంతో డ్రైవర్ గంగాధర్ మరో యాక్సిడెంట్ చేశాడు. శనివారం నిజాబాద్లోని ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న కృష్ణను ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోసారి ప్రమాదానికి కారణమవడంతో నిజామాబాద్ ఐదో ఠాణా పోలీసులు గంగాధర్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా నడిపి ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న గంగాధర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని రవాణాశాఖ అధికారులకు సిపార్సు చేయనున్నట్లు ఎస్సై జాన్రెడ్డి తెలిపారు.