Train Accident : పట్టాలు తప్పిన వారణాసి-సబర్మతి ఎక్స్ ప్రెస్.. కారణం ఇదే!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వేస్టేషన్కు సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైలు పట్టా విరిగిన విషయం ప్రమాదస్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. ఎవరో రైలు పట్టాలకు అడ్డంగా రాడ్డును పెట్టడం వల్లే రైలు పట్టాలు తప్పిందని అధికారులు గుర్తించారు.
అదృష్టవశాత్తూ ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో దాదాపు 20 బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఈ లైన్లో రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది.
యూపీలోని కాన్పూర్-భీమ్సేన్ స్టేషన్ల మధ్య తెల్లవారుజామున సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత, సబర్మతీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు చేరుకున్నాయి. సహాయకచర్యలు చేపట్టాయి. మరో వైపు కాన్పూర్కు ప్రయాణికులను తరలించేందుకు వీలుగా భారతీయ రైల్వే స్పెషల్ బస్సులను ఘటనాస్థలానికి పంపించింది. బస్సుల ద్వారా సబర్మతీ ఎక్స్ప్రెస్ ప్రయాణికులను కాన్పూర్కు తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా గమ్యస్థానానికి చేర్చారు.