మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాలో ఉద్రిక్తత నెలకొంది. భార్యను చంపిన భర్త ఇంటిపై.. మృతురాలి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఇల్లుతో పాటు.. అక్కడే ఉన్న ట్రాక్టర్ నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతురాలి బంధువులను చెదరగొట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
పదేళ్ల క్రితం తిమ్మక్కపల్లికి చెందిన రమేష్తో.. స్వరూప వివాహం అయింది. అయితే రమేష్ ఇటీవలే రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రమేష్, స్వరూప మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో స్వరూపను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు రమేష్. ఈ నెల ఆరో తేదీన పొలం పనుల కోసమని చెప్పి స్వరూపను బావి దగ్గరకు తీసుకెళ్లిన రమేష్... బలవంతంగా పురుగుల మందు తాగించాడు. దీంతో స్వరూప స్పృహ తప్పి పడిపోయింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిదంటూ.. స్వరూప తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు రమేష్.
రెండు రోజుల క్రితం స్వరూప.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వరూప తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆవేశానికి లోనైన మృతురాలి బంధువులు... రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.