మొబైల్ టారిఫ్లకు సంబంధించి ప్రభుత్వరంగ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులో టారిఫ్లు పెంచే ప్రణాళిక లేదని తెలిపింది. ‘సమీప భవిష్యత్తులో టారిఫ్లను పెంచడం లేదని స్పష్టంగా చెబుతున్నాం’ అని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ రాబర్ట్ రవి పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. సమీప భవిష్యత్తులో టారిఫ్లను పెంచాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. ఇక, వేగవంతమైన 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా కంపెనీ లోగోను మార్చింది. గతంలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ చిహ్నాలు ఉండగా.. తాజాగా దీనికి మార్పులు చేశారు. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచారు. దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్ను ఉంచారు.